కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
బృహత్తర చండీయాగ ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్, దేవాలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో 13వ స్వాముల సద్ధి కార్యక్రమంలో భాగంగా మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బృహత్తర చండీయాగ కార్యక్రమం ప్రారంభమైంది. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 13మంది వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, శివలింగానికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాలకు, గణపతి స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. శ్రీలక్ష్మీగణపతి, రుద్ర, చండీ హోమాలు ప్రారంభమయ్యాయి. చండీ, లలితా సహస్రనామ సామూహిక పారాయణాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చండీయాగం జనవరి 13 వరకు నిత్యం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.