కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.