మహాభారతంపై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహా భారతంలోని విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక వేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ ద్రౌపది అసాధారణ సౌందర్యాన్ని చూసి రాణి సోదరుడు, సర్వసైన్యాధ్యక్షుడైన కీచకుడు తీవ్రమైన మోహానికి గురవుతాడ న్నారు. ద్రౌపది తన భర్తలు గంధర్వులని, నన్ను తాకవద్దని ఎంత హెచ్చరిం చినా మదాంధుడైన కీచకుడు వినకుండా, రాజసభలోనే ఆమెను కాలితో తన్ని తీవ్రంగా అవమానిస్తాడన్నారు. ద్రౌపది రహస్యంగా భీముడిని కలిసి తన బాధను వెళ్లబోసుకుంటుందన్నారు. అక్కడ ద్రౌప దిలా ముసుగు తన్నుకుని వేచి ఉన్న భీముడు, కీచకుడితో భయంకరమైన మల్లయుద్ధం చేసి అతడి అవయవాలను విరిచి దారుణంగా సంహరిస్తాడన్నారు.
అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.