కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
అలరించిన శివుని కీర్తనల గానం ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి చింతలపాటి రమాగోపాలకృష్ణ గారి బృందంచే కార్తీకమాసం సందర్భంగా 30.11.2024 శనివారం శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన శివపదం లోని శివుని కీర్తనల గానం కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, అంజనీదేవి, నాగలక్ష్మి, పావని లు తమ గాత్రధారణలో పంచామృతాలలో, శివుడు ధరించిన, నమఃశివాయ, శివతత్వమొక శిఖరమై, ఏరీతి కరుణింతువో వంటి కీర్తనలు చక్కగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్పై పాలపర్తి ఆంజనేయశర్మ, తబలాపై బాలజీ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం రమాగోపాలకృష్ణ గాయనీమణులను జ్ఞాపికలతో సత్కరించారు.