కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
బృహత్తర చండీయాగ ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్, దేవాలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో 13వ స్వాముల సద్ధి కార్యక్రమంలో భాగంగా మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బృహత్తర చండీయాగ కార్యక్రమం ప్రారంభమైంది. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 13మంది వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, శివలింగానికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాలకు, గణపతి స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. శ్రీలక్ష్మీగణపతి, రుద్ర, చండీ హోమాలు ప్రారంభమయ్యాయి. చండీ, లలితా సహస్రనామ సామూహిక పారాయణాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చండీయాగం జనవరి 13 వరకు నిత్యం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.