కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
అలరించిన శివుని కీర్తనల గానం ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి చింతలపాటి రమాగోపాలకృష్ణ గారి బృందంచే కార్తీకమాసం సందర్భంగా 30.11.2024 శనివారం శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన శివపదం లోని శివుని కీర్తనల గానం కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, అంజనీదేవి, నాగలక్ష్మి, పావని లు తమ గాత్రధారణలో పంచామృతాలలో, శివుడు ధరించిన, నమఃశివాయ, శివతత్వమొక శిఖరమై, ఏరీతి కరుణింతువో వంటి కీర్తనలు చక్కగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్పై పాలపర్తి ఆంజనేయశర్మ, తబలాపై బాలజీ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం రమాగోపాలకృష్ణ గాయనీమణులను జ్ఞాపికలతో సత్కరించారు.