మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మానవ ధర్మాలలో దైవ, పితృ, రుషి రుణాలను ధర్మంగా పరిగణించి ఆచరించాలన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాటను ధర్మంగా భావించి వనవాసానికి వెళ్ళాడన్నారు. మహాభారతంలో దమయంతి వృత్తాంతంలో భాగంగా బృహదశ్వుడు చెప్పిన నలుడి కథలో,నలుడు కూడా తన భార్యను, రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో కష్టాలు అనుభవించాడనీ,చివరికి అతను అన్ని కష్టాల నుండి బయటపడ్డారని తెలిపి ధర్మరాజుకు ఓర్పు, ధైర్యం నేర్పించాడన్నారు.
అలరించిన శివుని కీర్తనల గానం ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి చింతలపాటి రమాగోపాలకృష్ణ గారి బృందంచే కార్తీకమాసం సందర్భంగా 30.11.2024 శనివారం శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన శివపదం లోని శివుని కీర్తనల గానం కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, అంజనీదేవి, నాగలక్ష్మి, పావని లు తమ గాత్రధారణలో పంచామృతాలలో, శివుడు ధరించిన, నమఃశివాయ, శివతత్వమొక శిఖరమై, ఏరీతి కరుణింతువో వంటి కీర్తనలు చక్కగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్పై పాలపర్తి ఆంజనేయశర్మ, తబలాపై బాలజీ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం రమాగోపాలకృష్ణ గాయనీమణులను జ్ఞాపికలతో సత్కరించారు.