మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మానవ ధర్మాలలో దైవ, పితృ, రుషి రుణాలను ధర్మంగా పరిగణించి ఆచరించాలన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాటను ధర్మంగా భావించి వనవాసానికి వెళ్ళాడన్నారు. మహాభారతంలో దమయంతి వృత్తాంతంలో భాగంగా బృహదశ్వుడు చెప్పిన నలుడి కథలో,నలుడు కూడా తన భార్యను, రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో కష్టాలు అనుభవించాడనీ,చివరికి అతను అన్ని కష్టాల నుండి బయటపడ్డారని తెలిపి ధర్మరాజుకు ఓర్పు, ధైర్యం నేర్పించాడన్నారు.
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.