తెలుగు వెలుగు.. ఎన్టీఆర్
తెలుగు వెలుగుల గని ఎన్టీఆర్ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె.ఆర్.కె. ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ ఉపాధ్యక్షుడు వేములపల్లి విఠల్ అధ్యక్షత వహించారు. కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విలువలకు పట్టం కట్టిన గొప్ప మనిషిగా ఎన్టీఆర్ గుర్తింపు పొందడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. చలనచిత్ర రంగమైనా, రాజకీయ రంగమైనా ఆయన సామాజిక చైతన్యం, సంస్కరణల కోసమే ఎంచుకున్నారన్నారు. ఎన్టీఆర్ పేరున విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్యకు పురస్కారమివ్వడం ఎంతో సముచితంగా ఉందన్నారు. సభలో సంస్థ అధ్యక్షుడు ఘంటా పున్నారావు, గౌరవాధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ, యర్రా ఈశ్వరరావు, నూకవరపు వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావు, సీహెచ్. మస్తానయ్య, లంకా విజయబాబు, బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని లావు రత్తయ్యను ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అనంతరం కళాంజలి హైదరాబాద్ కళాకారులు యాగం నాటిక ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలందుకున్నారు. కార్యక్రమంలో బొప్పన నరసింహారావు(బుజ్జి), జి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి