ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో నైతిక విలువల పరిరక్షణ
సమాజంలో ధర్మం.. నీతి నిలిచి ముందుతరాలకు నైతిక విలువలు అందడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుందని ముస్సోరి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి అన్నారు. శనివారం రాత్రి బృందావన గార్డెన్స్ వెంక టేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై స్వధర్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ కు ధర్మ జ్యోతి పురస్కార ప్రదాన సభ జరిగింది. సభకు సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు అధ్యక్షత వహించారు. కృష్ణకుమారి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో సమాజంలో నేరప్రవృత్తి తగ్గుతుందన్నారు. పిల్లలకు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవ కాశం ఉంటుందని తద్వారా వారు ధర్మమార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందన్నారు. పురస్కార గ్రహీత మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నందువల్లనే ఇంత సమర్థంగా వృత్తి, సేవారంగాల్లో నెగ్గగలుగుతున్నారన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య మాట్లాడుతూ ఇంతకుముందు ఆలయ పాలకమండలికి కార్యదర్శిగా పనిచేసిన గుమ్మడి రాధాకృష్ణమూర్తి స్వధర్మ సేవా సంస్థకు శ్రీకారం చుట్టారని, ఆలయానికి అనుబంధంగా మహాప్రస్థానం, స్వధర్మ సేవాసంస్థ, అన్నమయ్య గ్రంథాలయం తదితరాలను నెలకొల్పారన్నారు. సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు సంస్థ ఆవిర్భావ వికాసాలను వివరించారు. ప్రసంగికులందరూ సీహెచ్ శైలజాకిరణ్ ధైర్యాన్ని, మార్గదర్శి అభివృద్ధిలో ఆమె చూపుతున్న సమర్ధతను కొనియాడారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారని ప్రశంసించారు. ఆనంతరం మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ కి ధర్మజ్యోతి పురస్కారాన్ని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఫీ రమణ ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠ పంచాంగాన్ని ఆవిష్కరించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి